లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్ రానందుకు ఒక పార్టీ నేత బోరున ఏడ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు అర్షద్ రాణా, ముజఫర్నగర్లోని చార్తావాల్ స్థానం నుండి టికెట్ ఆశించారు. చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దధేడు గ్రామానికి చెందిన ఆయన చాలా కాలంగా బీఎస్పీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య కూడా జిల్లా పంచాయతీ మెంబర్ పదవికి బీఎస్పీ తరపున పోటీ చేశారు.
దీంతో పార్టీ టికెట్పై ఆశలు పెట్టుకున్న అర్షద్ రాణా, చాలా కాలంగా బీఎస్పీ తరుఫున చార్తావాల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చార్తావాల్ అసెంబ్లీ స్థానం నుండి సల్మాన్ సయీద్ను పార్టీ పోటీకి దింపినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇటీవల ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత అయిన సల్మాన్ సయీద్, హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడు. కాగా, ఈ ప్రకటనతో హర్ట్ అయిన రాణా ఇటీవల ఫేస్బుక్లో తన కష్టాల గురించి రాసుకున్నారు.
అనంతరం అర్షద్ రాణా, తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి నగరానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన, పోలీసుల ముందు ఏడుస్తూ కనిపించారు. రెండేళ్ల క్రితం పార్టీ సీనియర్ నాయకుడు టికెట్ కోసం రూ. 67 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తనకు తెలియకుండానే తనకు టికెట్ను నిరాకరించారని విమర్శించారు. టికెట్ కేటాయించనందున తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పార్టీ నేతలను డిమాండ్ చేశారు. ఒక బీఎస్పీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాణా బెదిరించారు.
మరోవైపు రాణా ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్వాలి నగర ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు. కాగా, పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు అర్షద్ రాణా బోరున ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.