లక్నో: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. తాము అధికారంలోకి రాలేమని ఆ పార్టీ నేతల ముఖం చూస్తే అర్థమవుతుందని చెప్పారు. యూపీ నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆమె లక్నోలోని మున్సిపల్ నర్సరీ పాఠశాలలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ముస్లింలు ఎస్పీ పట్ల అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. వారు ఆ పార్టీకి ఓటేయరని చెప్పారు.
ఎస్పీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో అల్లర్లు జరిగాయని, మరోసారి ఆ పార్టీకి ఓటేస్తే గూండారాజ్, మాఫియా రాజ్ మళ్లీ వస్తుందని విమర్శించారు. దీంతో యూపీ ప్రజలు ఓటు వేయకముందే ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు.
యూపీలో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతున్నది. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో రైతులు, సిక్కుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Muslims, Samajwadi Party, UP, Gunda raj, Mafia raj, Power, BSP chief Mayawati