న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి డ్రోన్ల చొరబాటును భారత్ నిలదీసింది. సరిహద్దు ఉల్లంఘనలను నియంత్రించాలని సూచించింది. భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని ఆక్ట్రాయ్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్ మధ్య కమాండెంట్ స్థాయి సమావేశం బుధవారం జరిగింది. సరిహద్దులో స్తంభాల నిర్వహణ, తాజా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, పాకిస్థాన్ డ్రోన్ కార్యకలాపాలు, ఇతర కార్యకలాపాలతో సహా వివిధ అంశాలపై ఇరు దేశాల సరిహద్దు రక్షణ దళ కమాండర్లు చర్చించారు.
ఈ సందర్భంగా సరిహద్దుల నుంచి పాక్ డ్రోన్ల చొరబాటును బీఎస్ఎఫ్ ప్రస్తావించడంతోపాటు గట్టిగా నిలదీసింది. కాగా, బీఎస్ఎఫ్ రక్షణ నిర్మాణ పనులపై పాక్ రేంజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అన్ని సరిహద్దు సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని ఇరు కమాండర్లు అంగీకరించారు. సరిహద్దులో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.