BSF : బంగ్లాదేశ్ (Bangladesh) సరిహద్దుల్లో చొరబాట్లకు, నేరపూరిత కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సరిహద్దు భద్రతాదళం (BSF) సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సరిహద్దుల్లో కీలకమైన నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు (Snakes), మొసళ్ల (Crocodiles) ను వదలాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు జల్లాలోకి మొసళ్లు, పాములను వదలడం ఎంతవరకు సాధ్యమో పరిశీలించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తన ప్రాంతీయ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినట్లు జాతీయ మీడియా (National Media) లో కథనాలు వెలువడ్డాయి.
కాగా ఈ ప్రతిపాదనల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, దీని అమలులో అనేక సవాళ్లు ఉన్నాయని నేషనల్ మీడియా పేర్కొన్నది. పాములు, మొసళ్లను తొలుత సేకరించాలని, నదీతీర ప్రాంత ప్రజలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాలని చెప్పినట్లు ఓ బీఎస్ఎఫ్ అధికారిని ఉటంకిస్తూ మీడియా కథనాలు ప్రచురితమయ్యాయి.
బంగ్లాదేశ్, పాకిస్థాన్తో భారత్కు ఉన్న సరిహద్దు వద్ద రక్షణపరంగా ప్రధాన బాధ్యత బీఎస్ఎఫ్దే. దేశ తూర్పు సరిహద్దు వెంబడి (బంగ్లాదేశ్ వైపు) స్మగ్లింగ్, చొరబాటు కార్యకలాపాలపై కేంద్రం ఆందోళన వ్యక్తంచేస్తోంది. వాటికి చెక్ పెట్టేందుకు పలు ఆలోచనలు చేస్తున్నప్పటికీ.. ఈ ప్రాంతానికి ఎప్పుడూ వరద ముప్పు పొంచి ఉంటుంది. దాంతో ఫెన్సింగ్ వేయడం క్లిష్టంగా మారింది.
మరోవైపు తూర్పు సరిహద్దులో జనసాంద్రత కూడా అధికమే. ఫెన్సింగ్కు ప్రత్యామ్నాయంగా సరీసృపాలను ఉంచాలన్న ఆలోచన ఉన్నప్పటికీ.. సరిహద్దుకు ఇరువైపులా నివసించే ప్రజలకు అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వరదల సమయంలో అవి జనావాసాలకు కొట్టుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.