చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర సరిహద్దు లోపల 50 కిలోమీటర్ల వరకు కార్యకలాపాలు నిర్వహించుకునేలా కేంద్రం బీఎస్ఎఫ్ బలగాలకు అధికారం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చన్నీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలుమార్లు ప్రతిపాదనలు చేశారు.
అయినా చన్నీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. చండీగఢ్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చన్నీ మాట్లాడుతూ.. పంజాబీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించరని, వారికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ విషయమై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.