Yediyurappa | బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు పోక్సో కేసులో సీఐడీ బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యెడియూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర గురువారం పేర్కొన్నారు. దీనిపై సీఐడీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం యెడియూరప్ప ఢిల్లీలో ఉండడంతో జూన్ 17వ తేదీన సీఐడీ ముందు హాజరవుతానని పేర్కొన్నారు.
17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. అయితే తన బిడ్డను యెడియూరప్ప బలవంతంగా ఓ గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యెడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవలే చనిపోయారు. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు నమోదు చేశారు.