CM KCR | దేశంలో కావాల్సినంత నీరుందని, అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలకు సాదర స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరాఠా నేతలందరికీ స్వాగతం. 75 సంవత్సరాల దేశంలో ఎక్కడ సమస్య అక్కడ ఉండడానికి కారణం ఏంటీ? నేను చెప్పే మాటలను విని వదిలేయకుండా విని వదిలేయకుండా మీమీ గ్రామాలకు వెళ్లి చర్చించండి.
మనలో చైతన్యవం రానంత వరకు మన జీవితంలో మార్పు రాదు. దేశంలో ఏం జరుగుతుందో మన కళ్లముందే ఉన్నాయి. కరెంటు విషయంలో తెలంగాణ తప్ప దేశమంతా సంక్షోభమే. దేశంలో నీళ్లు కావాల్సినన్ని ఉన్నాయి. అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నీటి సంక్షోభం వెనుక కారణం ఏంటీ? నీళ్లు ఎక్కడా.. ఏ ఫ్యాక్టరీలో తయారుకావ్ దేవుడు ఇచ్చిన వరం. నీళ్ల ముచ్చట చిన్నదే కానీ ఎవరూ ఆలోచించరు. నీళ్లు అమూల్యమైనవి. కానీ మన దగ్గర పట్టింపు లేదు. ఏ రాజకీయ నాయకుడికి నీటి గురించి చింత లేదు. ఓట్లు పడుతున్నాయి. వాళ్ల దుకాణం నడుస్తోంది. ఎలక్షన్ వచ్చే సరికి మనకు రకరకాల అబ్లిగేషన్లు వస్తుంటాయి. గడ్చిరోలి నుంచి గోదావరి ప్రవహిస్తుంది. కానీ, అక్కడ తాగునీరు ఉండదు’ అన్నారు.
‘దేశంలో 83కోట్ల ఎకరాల భూమిలో 41కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యమైంది. బర్గర్లు, పిజ్జాలు తినాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చింది మనకు. దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లివ్వొచ్చు. కానీ, పాలకులు పట్టించుకోరు. దేశంలో ప్రతీ ఎకరానికి సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ నినాదం. బీఆర్ఎస్ ఈ నాటకాలన్నీంటికి చరమగీతం పాడుతుంది. సాగు, తాగు నీరు అందిస్తాం. దీనిపై బీఆర్ఎస్ శపథం చేస్తుంది. తెలంగాణలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్నాం. మిషన్ భగీరథ పేర ఇస్తున్నాం. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఏ నీరు తాగుతున్నారో.. ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు కూడా అదే నీళ్లు అందుతున్నాయి.
మహారాష్ట్రలో ఇది ఎందుకు అమలు చేయడం లేదు. నదులు పెన్ గంగా, వార్దా, గోదావరి నదులు ఉన్నా కూడా తాగునీటికి కష్టాలే. ఔరంగాబాద్, అకోలాలో నీటి కష్టాలు ఉన్నాయి. పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని చెప్పారు. దీనికి కారణం ఎవరు..? కొన్ని పరిస్థితులను చూస్తుంటే దుఃఖం వస్తుంది. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగాయి. కరెంట్ కష్టాలు కూడా మాయం అయ్యాయి. తెలంగాణలో పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణలో 15 నిమిషాలకో భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. పట్టా చేతికొస్తుంది.
నీళ్లు, కరెంటు విషయంలో దేశ ప్రజలను ఎందుకు వంచిస్తున్నారు? ప్రకృతి ఇచ్చిన వరాన్ని ఎందుకు కాలరాస్తున్నారు’ అంటూ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మన సమస్యలు తీర్చరని, మనమెంత చైతన్యవంగా ఉంటే అంత త్వరగా సమస్యలు తీరుతాయన్నారు. మేకిన్ ఇండియా అంటారు. దేశమంతా నిండా చైనా బజార్లే ఉంటాయి. పతంగుల మాంజా నుంచి దేవుళ్ల ప్రతిమ వరకు చైనా నుంచే వస్తాయి. ఫ్లయిట్ నుంచి లైట్ వరకు చైనా నుంచే ఎందుకు తెచ్చుకోవాలి. మన వస్తువులను మనం తయారు చేసుకునే శక్తి, యుక్తి సంపత్తి మనకు లేదా? అని ప్రశ్నించారు.
‘భారత్ పరివర్తన్ మిషన్గా భారత్ రాష్ట్ర సమితి పని చేస్తుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఏం పని అని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్కు వెళ్లిపోతామని చెప్పాం. ఫడ్నవీస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్ కావాలి. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణలో సాధ్యమైనన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు. మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి. ఓటు వేస్తేనే మీకు ఎవరైనా సహాయం చేయగలరు.
మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలుంటారు. అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాం. జిల్లా పరిషత్ ఎన్నికలతో మన పని మొదలవుతుంది. ప్రతీ గడపను తాకండి. ప్రతీ మనిషినీ పలకరించండి. నాగ్పూర్, ఔరంగాబాద్లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. మే 7 నుంచి జూన్ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీ వేస్తాం. 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.