BRS Party | పార్లమెంట్ సభ్యులకు భారత రాష్ట్ర సమితి విప్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో సభ్యులు హాజరుకావాలని ఆదేశించింది. లోక్సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రానున్న నేపథ్యంలో విప్ జారీ అయ్యింది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎంపీ బీబీ పాటిల్ విప్ జారీ చేశారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణ విషయంలో తీసుకువచ్చిన వివాదాస్పద ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తెచ్చేందుకు మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ను నిరసిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పార్లమెంట్లో ఆమోదం పొందకపోతే ఆర్డినెన్స్ రద్దవుతుంది. మళ్లీ పార్లమెంట్ సమావేశాల తర్వాత మరోసారి తిరిగి ఆర్డినెన్స్ను జారీ చేసే అవకాశం ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు సహా ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు పోస్టుల అధికారం స్థానిక ప్రభుత్వానికే ఉంటుందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఆ తర్వాత ‘ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు’ ఆర్డినెన్స్ను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఢిల్లీపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతున్నది. పార్లమెంట్లో ఆర్డినెన్స్ చట్టంగా మారునున్న నేపథ్యంలో బిల్లును వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు పార్టీల అధినేతలను కలిశారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సైతం కలిసి బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎంపీలకు విప్ జారీ చేసింది.