హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా మేరకు విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతుందని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా కేంద్రానికి పన్నులు, పన్నులేతర మార్గాల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి రూ. 30,48,044 కోట్ల ఆదాయం లభిస్తోందని, కానీ రాష్ట్రాల వాటా మేరకు తెలంగాణాకు చెల్లింపులు చేయకుండా కేంద్రం తీవ్ర వివక్షత చూపిస్తుందని నామా నాగేశ్వరరావు ఆరోపించారు.
సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నామా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంతో సహా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లభిస్తున్న ఆదాయం, తిరిగి చెల్లింపులకు సంబంధించిన సమగ్ర వివరాలను సభలో వెల్లడించాలని ఎంపీ నామా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రానికి వివిధ రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో రూ.30,50,044 కోట్ల రాబడి సమకూరగా, అందులో రాష్ట్రాలకు ఇచ్చింది కేవలం రూ.8,82,903.79 లక్షల కోట్లు మాత్రమేనని, మిగతా మొత్తం ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. దాదాపు రూ. 22 లక్షల కోట్లు కేంద్రం వద్ద ఉంచుకొని, రాష్ట్రాలకు భిక్ష వేసినట్లు చేతులు విదిలిస్తుందని దుయ్యబట్టారు.
రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటాకు ఎగనామం పెడుతుందని మండిపడ్డారు. రాష్ట్రాల వారీగా వసూలైన ఆదాయం డేటా అడిగితే తమ వద్ద లేదని కేంద్రం చేతులెత్తేసిందని ఆరోపించారు. రాష్ట్రాలకు తిరిగి చెల్లింపుల్లో విపరీతమైన కోత విధిస్తూ, వివక్ష చూపిస్తున్నారని నామా పేరొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,720.54 కోట్లను పంపిణీ చేయడం జరిగిందని కేంద్ర మంత్రి చెప్పారని, కానీ రాష్ట్రం నుంచి ఎంత వసూలు చేశారో చెప్పమంటే మాత్రం తమ వద్ద అందుకు సంబంధించిన డేటా లేదనడం సమంజసంగా లేదని నామా నాగేశ్వర్ రావు పేరొన్నారు. కేంద్రం వసూలు చేసిన దానికి, ఇచ్చిన దానికి పొంతనే లేదని, కేంద్రం గణాంకాలే వివక్షతను స్పష్టం చేస్తున్నాయని నామా పేరొన్నారు. కేంద్రం వివక్షతను వీడి, తెలంగాణకు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని నామా నాగేశ్వర్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.