హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి రాజకీయ కుట్రలు చేశాయని, అందులో భాగంగానే జాగృతి నేత కవితను అక్రమంగా అరెస్టు చేసి, బీఆర్ఎస్ను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కల్పిత లిక్కర్ స్కామ్ పేరుతో దుష్ప్రచారం చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని కూలదోశారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి దుష్ప్రచారం చేయడం ద్వారా బీఆర్ఎస్ కొంతమేరకు నష్టాన్ని చూడాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రతి కేసు కూడా రాజకీయ ప్రేరేపితం, కల్పితం అన్న విషయం త్వరలోనే బహిర్గతమవుతుందని చెప్పారు. నిజానిజాలు వెలుగులోకి వచ్చేంతవరకు బీజేపీ, కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు టీవీ సీరియల్లాగా కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. కొన్ని మీడియా వర్గాలు, సంస్థలు విచారణకు ముందే తీర్పు ఇచ్చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.