భోపాల్, మే 28: తమ ఇంటి ఆడబిడ్డపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డ వారికి వ్యతిరేకంగా పోరాడటమే ఓ దళిత కుటుంబానికి శాపమైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కేసు వెనక్కు తీసుకోకపోవడం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి అంతులేని విషాదంలో మునిగిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దారుణ సంఘటనలు జరిగాయి. సాగర్ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువతి(20) తనను లైంగిక వేధించారని, బెదిరించి, దాడికి పాల్పడ్డారని 2019లో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు ఆ యువతి వయసు 15 ఏండ్లు. ఆమె ఫిర్యాదు మేరకు ఆజాద్ ఠాకూర్, విశాల్ ఠాకూర్, పుష్పేంద్ర ఠాకూర్, చోటు రైక్వార్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు చట్టాల కింద కేసు నమోదైంది. 2020 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఈ సంఘటన అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ అంశంగా మారింది.
ఎన్నికలు ముగిసిన తర్వాత ఫిర్యాదు ఉపసంహరించుకోవాల్సిందిగా యువతి కుటుంబంపై నిందితుల తరపు నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. గత ఏడాది ఆగస్టులో వంద మందికి పైగా ఉన్న ఓ మూక బాధితురాలి కుటుంబంపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఆమె సోదరుడు(18) మృతి చెందాడు. కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె తల్లిపైనా దాడికి పాల్పడి, బట్టలు లాగేసి అవమానించారు. ఈ ఘటనపై కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. విక్రమ్ ఠాకూర్, విజయ్ ఠాకూర్, ఆజాద్ ఠాకూర్, కోమల్ ఠాకూర్, లాలూ ఖాన్, ఇస్లాం ఖాన్, గోలు సోని, నఫీస్ ఖాన్, వహీద్ ఖాన్పై పోలీసులు హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా యువతి బంధువు ఉన్నారు. దీంతో శనివారం ఆయనను కొందరు వ్యక్తులు ఫోన్ చేసి పిలిపించి సాక్ష్యాన్ని వెనక్కు తీసుకోవాలని బెదిరించారు. ఇందుకు అంగీకరించకపోవడంతో అతడితో పాటు, వెంట వెళ్లిన మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ యువతి బంధువు మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ఆయన మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఊరికి తీసుకొస్తుండగా బాధిత యువతి వ్యాన్ నుంచి కిందపడి తీవ్ర గాయాలతో కన్నుమూసింది. వ్యాన్ రన్నింగ్లో ఉండగా ఆమె ఒక్కసారిగా కిందకు దూకేసి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు తెలిపారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఆరోపించింది.