న్యూఢిల్లీ, నవంబర్ 9: భారత్లో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు జారుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఇంగ్లండ్ న్యాయవ్యవస్థలో ద్వారాలు మూసుకుపోయాయి. దీంతో ఆయనను భారత్కు అప్పగించడానికి మార్గం సుగమమైంది. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై భారత్లో విచారణ ఎదుర్కొంటే తన మానసికస్థితి దిగజారిపోయి ఆత్మహత్య చేసుకొనే ప్రమాదముందని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను బ్రిటన్ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
నీరవ్ని భారత్కు అప్పగించాలని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుతుందని తెలిపింది. రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్లోని లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువార్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. అప్పగింతకు అనుకూలంగా వెస్ట్మినిస్టర్ జడ్జి ఇచ్చిన తీర్పును నీరవ్ సవాల్ చేశారు.