న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) ఉండాల్సింది జైలులో అని, పార్లమెంట్లో కాదని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ దుయ్యబట్టారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి అతడిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు మంగళవారం కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బ్రిజ్ భూషణ్ను విచారించి శిక్ష విధించవచ్చని అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్పై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ బుధవారం మండిపడ్డారు. అనేక క్రిమినల్ కేసులు నమోదైన పెద్ద రాజకీయ నేతగా దేశం మొత్తానికి ఆయన గురించి తెలుసని విమర్శించారు. బ్రిష్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నెల రోజుల పాటు ఢిల్లీ వీధుల్లో కూర్చున్నారని గుర్తు చేశారు. అయితే మహిళా రెజ్లర్ల నిరసనలు, ఆక్రందనలను పోలీసులు పట్టించుకోకపోగా బాధితులనే అవమానించారని విమర్శించారు.
కాగా, ఢిల్లీ పోలీసులు ఇప్పుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఖచ్చితమైన సాక్ష్యాలను కోర్టులో సమర్పించారని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. అయినప్పటికీ ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని పోలీసులను ప్రశ్నించారు. అలాగే బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీశారు. ఆయన ఉండాల్సింది పార్లమెంట్లో కాదు జైలులో అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియోను ఆమె పోస్ట్ చేశారు.
#BrijBhushan की जगह जेल में है संसद में नहीं pic.twitter.com/nNd5yz2F4i
— Swati Maliwal (@SwatiJaiHind) July 12, 2023