న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల నిరసనలు చేసిన అగ్రశ్రేణి రెజర్లపై కేసు నమోదు చేయాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. లైంగిక వేధింపుల పేరుతో నిరసనకు దిగిన టాప్ రెజ్లర్లు, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయాలని బలవంతం చేయడంతోపాటు తనను బ్లాక్మెయిల్ చేశారంటూ ఆ పిటిషన్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి నిరసనకు దిగిన రెజ్లర్లు వినేష్ ఫొగాట్, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్, సుమన్ మాలిక్, అన్షు మాలిక్, బజరంగ్ పునియా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టును కోరారు.
కాగా, మీడియాపై కూడా బ్రిజ్ భూషణ్ ఆరోపణలు చేశారు. మీడియా ఇప్పుడు జనతా అదాలత్ (పబ్లిక్ కోర్టు)గా మారిందని, కోర్టు విచారణలో జోక్యం చేసుకోవడం ప్రారంభించిందని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థల పేర్లను కూడా పిటిషన్లో పేర్కొన్నారు. వాటిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన వంట మనిషితో వేయించిన ఈ పిటిషన్ను తర్వాత వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.