న్యూఢిల్లీ, డిసెంబర్ 10: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ అంత్యక్రియలను శుక్రవారం ఉదయం బ్రార్ స్కేర్ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియల్లో ఆయన కుమార్తె ఆశ్నా లిద్దర్, సతీమణి గీతిక మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అదే సమయంలో స్ఫూర్తిని నింపాయి. ‘దేవుడి నిర్ణయం ఇదే అయితే మేం ఇలాగే జీవిస్తాం. ఇది పూడ్చలేని నష్టం. కానీ, ఇప్పుడు మేం ఆయనకు గొప్పగా వీడ్కోలు పలకాలి. కన్నీటితో కాకుండా నవ్వుతూ సాగనంపాలి. నేనొక సైనికుడి భార్యను’ అని లిద్దర్ సతీమణి గీతిక అన్నారు. మరోవైపు, లిద్దరు కుమార్తె ఆశ్నా మాట్లాడుతూ.. ‘నాకు 17 ఏండ్లు. అంటే నాకు, మా నాన్నకు మధ్య 17 ఏండ్ల అనుబంధం ఉంది. ఆయన మాకు మిగిల్చిన అందమైన జ్ఞాపకాలతో మేం ముందుకు వెళ్తాం. ఆయన దూరం కావడం దేశానికి పూడ్చలేని నష్టం. బహుశా ఇదే విధి అనుకొంటా. నా తండ్రి హీరో. నా బెస్ట్ ఫ్రెండ్. నా స్ఫూర్తి’ అన్నారు. లిద్దర్ 1969 జూన్ 26న జన్మించారు. 2021 జనవరి నుంచి రావత్కు డిఫెన్స్ అసిస్టెంట్గా ఉన్నారు. 1990 డిసెంబర్లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్లో పనిచేశారు.