న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రోజున.. పార్లమెంట్కు ఆర్థిక మంత్రి ఓ సూట్కేసుతో వచ్చేవారు. ఆ బ్రీఫ్కేస్లో ఉన్న బడ్జెట్ పత్రాలను సభలో చదివి వినిపించేవారు. ఇదీ ఒకప్పటి ట్రెండ్. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ సాంప్రదాయానికి 2019లో మోదీ సర్కార్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. బ్రీఫ్కేస్కు గుడ్బై చెబుతూ ఆ ఏడాది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బహీఖాతా పుస్తకంతో పార్లమెంట్కు వచ్చారు. ప్రతి షాపుల్లో తమ ఖాతాలును మేనేజ్ చేసేందుకు బహీఖాతా పుస్తకాన్ని వాడే విషయం తెలిసిందే. ఆ స్టయిల్లోనే కేంద్ర మంత్రి నిర్మల 2020లో కూడా బహీఖాతా పుస్తకంతోనే పార్లమెంట్కు బడ్జెట్ రోజున వచ్చారు. ఖాతా బుక్ చుట్టు ఎర్రటి వస్త్రాన్ని కట్టి తీసుకువచ్చారు. ఇక డిజిటలైజేషన్తో పాటు కరోనా నేపథ్యంలో ఆ ఖాతా బుక్ కాస్త.. డిజిటల్ రూపానికి మారింది. బహీఖాతా బుక్ స్థానంలో గత ఏడాది ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్ తెచ్చారు. గత ఏడాది కేంద్ర బడ్జెట్ కోసం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ను కూడా లాంచ్ చేశారు. మంత్రులు, సాధారణ ప్రజలకు బడ్జెట్ డాక్యుమెంట్ అందుబాటులో ఉండేందుకు ఈ యాప్ను ఆవిష్కరించారు. 1947లో తొలి ఆర్థిక మంత్రి ఆర్కే శణ్ముకన్ చెట్టి లెదర్ పోర్ట్ఫోలియో బ్యాగ్ తో పార్లమెంట్కు వచ్చారు. 1970 దశకంలో ఆర్థిక మంత్రులు హార్డ్ లెదర్ బ్యాగ్తో వచ్చారు. ఆ బ్యాగ్ల కలర్ మారుతూ వచ్చింది.