Uttar Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్లో ఘరానా మోసం బయటపడింది. సామూహిక వివాహాల పథకం కింద ప్రభుత్వం అందజేసే సొమ్మును కాజేసేందుకు కేటుగాళ్లు నకిలీ పెండ్లిండ్లు నిర్వహించారు. వరుడు లేకుండానే వందలాది మహిళలు ఎవరికి వారు మెడలో దండలు వేసుకొని పెండ్లి తంతు మమ అనిపించడం ఒక ఎత్తు అయితే.. రూ.500-రూ.2000 ఇచ్చి కిరాయికి తీసుకొచ్చిన వారిని ఈ కార్యక్రమంలో కూర్చొబెట్టడం మరో ఎత్తు.
గత నెల 25న బలియా జిల్లాలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో జరిగిన ఈ స్కామ్ను చూపే వీడియో వైరల్గా మారింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇద్దరు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సహా మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ రోజున కార్యక్రమంలో భాగంగా 568 జంటలకు పెండ్లిండ్లు జరుగ్గా.. అందులో దాదాపు 200 జంటలు నకిలీ అని తేలినట్టు అధికారులు వెల్లడించారు.
వీరిలో కొంత మంది గతంలో పెండ్లి చేసుకొన్న వారు, పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే కేక్తి సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం గమనార్హం.యూపీలో సామూహిక వివాహాలు చేసుకొన్న జంటలకు ప్రభుత్వం రూ.51 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది.