భోపాల్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన రమేశ్ లాల్కు ఇద్దరు కూతుర్లు. పేర్లు నిఖిత, కరిష్మా. ఇద్దరికీ పెండ్లి నిశ్చయమైంది. ఒకే ముహూర్తంలో వివాహం. అక్కాచెల్లెల్లిద్దరూ ఒకే రకమైన పెండ్లి దుస్తులు కొనుక్కొన్నారు. ముఖానికి మేని ముసుగు తొడుక్కొన్న ఇద్దరు నవ వధువులను పెద్దవాళ్లు పెండ్లి మంటపంలోకి తీసుకువచ్చారు. ఇంతలో కరెంటు పోయింది. ఎంతకీ రాలేదు.
ముహూర్తం దాటిపోతుందని పండితులు ఆ చీకట్లోనే పెండ్లి తంతు నిర్వహించారు. తర్వాత రెండు జంటలు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. అక్కడ వధువు ముసుగును తొలిగించిన పెండ్లి కొడుకు షాక్ అయ్యాడు. చెల్లి స్థానంలో అక్క ఉంది. చీకట్లో పెండ్లి కుమార్తెలిద్దరూ తారుమారయ్యారు. దుస్తులు కూడా ఒకే రకంగా ఉండటంతో ఎవరూ గుర్తుపట్టలేదు. రెండు జంటలకు మళ్లీ పెండ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.