Data leak | న్యూఢిల్లీ, జూన్ 14: తగతేడాది పీఎఫ్ ఆర్గనైజేషన్లో డాటా ఉల్లంఘన, 2020లో రైల్ యాత్రి పోర్టల్ ఉల్లంఘన, 2022లో ఎయిమ్స్పై ర్యాన్సమ్వేర్ తాజాగా కొవిన్ పోర్టల్ నుంచి డాటా లీక్.. పౌరుల వ్యక్తిగత గోప్యత అంగట్లో సరుకుగా మారింది. మూడో కంటికి తెలియకుండా భద్రంగా ఉండాల్సిన వివరాలను కొన్ని ముఠాలు కట్టగట్టి బజార్లో అమ్మేస్తున్నాయి. ఫలితంగా ప్రజల గోప్యతకు భంగం వాటిల్లుతున్నది. తాజాగా కొవిన్ డాటా టెలిగ్రామ్లో లీక్ కావడం దేశ ప్రజల్లో ఆందోళనను మరిం పెంచింది. ఈ డాటా సైబర్ నేరగాళ్ల నుంచి అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. కొవిన్ పోర్టల్ డాటా టెలిగ్రామ్ యాప్లో కనిపించి అందరినీ విస్మయానికి గురిచేసింది. డాటా లీకేజీ వార్తలను కేంద్రం కొట్టిపడేసినా ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న డాటా ఉల్లంఘనలు ప్రజల కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి. చోరీకి గురైన సమాచారం సైబర్ నేరగాళ్లకు అరటిపండు వలిచి పెట్టినట్టుగా మారుతున్నదని నిపుణులు చెబుతున్నారు. చేతికందిన డాటాను దోపిడీకి, ఐడెంటిటీ థెఫ్ట్స్, ఫిషింగ్ అటాక్స్, ఇతర సైబర్ నేరాలకు ఉపయోగించుకుంటున్నారు.
కొవిన్ పోర్టల్లోని సమాచారాన్ని తస్కరించాలంటే ఓటీపీ అవసరమని కేంద్రం చెబుతున్నప్పటికీ టెలిగ్రామ్లో ఉన్న డాటా సైబర్ నేరగాళ్లు ఓటీపీని సెట్ చేసుకునేలా ఉందని చెబుతున్నారు. లీకైన డాటాతో బ్యాంకింగ్ వ్యవస్థనూ మోసం చేసే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొన్నారు. వ్యక్తుల మొదటి పేరు, పుట్టిన తేదీలను ఉపయోగించుకుని ‘బ్రూట్ ఫోర్స్’ దాడులకు కూడా తెగబడే అవకాశం ఉందంటున్నారు. 16 రాష్ర్టాల్లో విస్తరించిన సైబర్ ముఠాలను ఉద్దేశిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ ఆందోళన వ్యక్తం చేశాడు. పీఎం-కిసాన్ లీకుల ద్వారా ఆధార్-జీఎస్టీ నకిలీ బిల్లింగ్ స్కామ్తోపాటు లీకైన ఆధార్ వివరాలను ఉపయోగించుకుని ప్రావిడెంట్ ఫండ్లోని సొమ్మును సైబర్ ముఠాలు ఉపసంహరించుకున్న విషయాన్ని అతడు గుర్తు చేశాడు.
ఎవరైనా ఆధార్ సెంటర్ నిర్వాహకుడు ఇలాంటి సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపితే ఒక్క ఫోన్ నంబరును మార్చడం ద్వారా మన గుర్తింపును టేకోవర్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో 60 వేలకుపైగా ఆపరేటర్లను యూఐడీఏఐ బ్లాక్లిస్టులో పెట్టింది. గతేడాది పీఎఫ్ ఆర్గనైజేషన్ ఉల్లంఘన, 2020లో రైల్ యాత్రి పోర్టల్ ఉల్లంఘన, 2022లో ఎయిమ్స్పై ర్యాన్సమ్వేర్ దాడులను గుర్తు చేస్తూ సాంకేతిక లోపాలే సమాచార తస్కరణకు కారణమవుతున్నాయని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్కు చెందిన అపర్ గుప్తా తెలిపారు. చట్టపరమైన జవాబుదారీతనం లేని కారణంగా ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఫలితంగా పౌరుల వ్యక్తిగత భద్రత ఆందోళనకరంగా మిగిలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.