న్యూఢిల్లీ, ఆగస్టు 8: మేధావులు, నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా, ఆందోళనలు వ్యక్తమవుతున్నా విద్యుత్తు చట్టం సవరణ విషయంలో కేంద్రం నిరంకుశంగా ముందుకు వెళ్తున్నది. విపక్షాల నిరసనల నడుమే విద్యుత్తు సవరణ బిల్లు-2022ను కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. సంప్రదింపుల కోసం బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని స్పీకర్ ఓంబిర్లాను కోరారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆరెస్పీ, సీపీఎంతో పాటు ఇతర విపక్ష పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ సమాఖ్య నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నదని ఎంపీలు విమర్శించారు. అనంతరం బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. విద్యుత్తు రంగాన్ని అప్పనంగా ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసే కుట్రలో భాగంగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ప్రతిపక్ష పార్టీలతో పాటు మేధావులు, నిపుణులతో పాటు విద్యుత్తు రంగ ఉద్యోగులు, కార్మికులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
రాజ్యాంగ విరుద్ధంగా మోదీ సర్కార్
విద్యుత్తు రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు. ఈ బిల్లు విద్యుత్తు పంపిణీలో ప్రభుత్వ పాత్రను తగ్గిస్తుందని అన్నారు. విద్యుత్తు అనేది ఉమ్మడి జాబితా అంశమని, బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టేకంటే ముందు కేంద్రం రాష్ర్టాలతో సంప్రదింపులు చేయడం విధి అని, అయితే మోదీ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరెస్పీ ఎంపీ ప్రేమచంద్రన్ మండిపడ్డారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా బిల్లు ఉన్నదని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, సీపీఎం ఎంపీ ఎంఏ ఆరిఫ్ అన్నారు. ప్రతిపాదిత సవరణలు ఉచిత విద్యుత్తు అందుకుంటున్న పేద రైతులకు తీవ్ర ప్రభావం చూపుతాయని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల విమర్శలపై మంత్రి అర్కే సింగ్ స్పందిస్తూ.. బిల్లుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాయితీలకు మంగళం!
విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా మోదీ సర్కార్ విద్యుత్తు సవరణ బిల్లు తీసుకొచ్చిందనే విమర్శలు ఉన్నాయి. బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే విద్యుత్తు వినియోగదారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రైతులు, అణగారిన వర్గాల ప్రజలకు అందుతున్న రాయితీలు రద్దు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు ఇకపై టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవల కోసం ఆపరేటర్ను ఎంచుకున్నట్టుగా విద్యుత్తు కోసం సరఫరాదారులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్తు రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు సోమవారం దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా, వడోదర, భోపాల్, పాట్నా, తిరువనంతపురం, బెంగళూరు, విజయవాడ, లక్నో, తదితర నగరాల్లో జరిగిన ఈ ఆందోళనల్లో లక్షలాది సంఖ్యలో ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులు పాల్గొన్నారని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) పేర్కొన్నది. బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే ఓ ప్రకటనలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని హితవు పలికింది. నామమాత్రంగా వీలింగ్ చార్జీలు చెల్లించి ప్రైవేటు కంపెనీలు లాభాలు ఆర్జిస్తాయని, తద్వారా ప్రభుత్వ సంస్థలు ఆర్థికంగా దివాళా తీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.