Uttarakhand High Court | పిల్లల పెంపకంపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంప్రదాయంగా పిల్లల బాధ్యతలను తల్లిదండ్రులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ సంప్రదాయ బాధ్యతలను తోసిపుచ్చిన ఉత్తరాఖండ్ హైకోర్టు.. పిల్లల పెంపకం బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇటీవల సీఆర్పీసీలోని సెక్షన్ 125కి చేసిన సవరణ ఆధారంగా ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు చెప్పినట్లు తెలుస్తున్నది. ఒక పురుషుడు (వ్యక్తి) తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు చేపట్టాలన్న నిబంధనలో ‘వ్యక్తి’ అని చూస్తే స్త్రీ, పురుషులకు.. అంటే తల్లిదండ్రులకు అని కూడా వర్తిస్తుంది.
అన్షూ గుప్తా అనే మహిళను ఆమె కొడుకు మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.2000 ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు 2013లో తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న అన్షూ గుప్తాకు 1999లో నాథూలాల్తో వివాహమైంది. వారిద్దరికి ఒక కొడుకు పుట్టిన తర్వాత విభేదాలు రావడంతో 2006లో విడిపోయారు.
నాథూ లాల్ తన ఆర్థిక పరిమితుల నేపథ్యంలో కొడుకు విద్య, భవిష్యత్ కోసం నిధులు సమకూర్చలేనని అశక్తత వ్యక్తం చేశాడు. దీంతో నెలకు రూ.27 వేల వేతనం అందుకుంటున్న అన్షూ గుప్తా తన కొడుకు మెయింటెనెన్స్ కోసం రూ.2000 చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.
కానీ నాథూలాల్తో విడాకులు తీసుకున్నాక.. బాబూ లాల్ అనే వ్యక్తిని పెండ్లి చేసుకున్నానని, తమ ఇద్దరికి మరో కొడుకు ఉన్నాడని అన్షూగుప్తా వాదించింది. రోడ్డు ప్రమాదంలో బాబూలాల్ మరణించాడని, నాటి నుంచి తన రెండో కొడుకు, బాబూలాల్ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సి ఉందని వాదించింది.
దీనిపై నాథూలాల్ న్యాయవాది స్పందిస్తూ.. సీఆర్పీసీ నిబంధన ప్రకారం వ్యక్తి అంటే తల్లిదండ్రులు ఇద్దరూ వస్తారని, కేవలం తండ్రికి మాత్రమే పరిమితం చేయరాదని వాదించారు. ఇటీవల సీఆర్పీసీ సెక్షన్ 125కి చేసిన సవరణ ప్రకారం వ్యక్తి అంటే తల్లిదండ్రులు అని పరిగణించాలని, తండ్రికి మాత్రమే పరిమితం కాదని వాదించారు. ఈ వాదనతో ఉత్తరాఖండ్ హైకోర్టు ఏకీభవించింది.
ఇప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న అన్షూ గుప్తా నెలకు దాదాపు రూ. లక్ష వేతనం అందుకుంటున్న విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. 2013 ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను ధ్రువీకరించింది.