హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చారిత్రక బొర్రా గుహలను (Borra Caves) సందర్శించాలనుకుంటున్నారా. అయితే మీకో బ్యాడ్ న్యూస్. పర్యాటకులను కనువిందు చేస్తున్న బొర్రా గుహలు నేటి నుంచి మూతపడనున్నాయి. ఏపీ టూరిజం (AP tourism) కార్మికులు సమ్మె (Strike) చేస్తుండటమే దీనికి కారణం. 2017 నుంచి పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు నోటీసులు ఇచ్చారు. అయితే కార్మికులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి నిరవధిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
తైడా జంగిల్ బెల్స్, బొర్రా గుహలు, అనంతగిరి హిల్ రిసార్ట్స్, అరకులోయలోని హరిత వ్యాలీ, మయూరి హిల్ రిసార్టులు, లంబసింగి రిసార్టులో పనిచేస్తున్న కార్మికులు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో బొర్రా గుహలతోపాటు పర్యాటక ప్రాంతాలు, టూరిజం శాఖ అతిథి గృహాలు మూతపడనున్నాయి. దీంతో ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న పర్యాటకుల్లో టెన్షన్ నెలకొన్నది.
బొర్రా గుహలు సుమారు 150 మిలియన్ ఏళ్ల కిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఇవి విశాఖపట్నానికి 90 కిమీల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. 1807లో విలియం కింగ్ అనే బ్రిటీష్ బౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనుగొన్నారు. సముద్రమట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్న గుహలు కొన్ని మిలియన్ ఏళ్ల కిందట నీటి ప్రవాహం వల్ల ఏర్పడ్డాయి. ఈ జరిపిన తవ్వకాల్లో 30 వేల నుంచి 50 వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి. వీటి ఆధారంగా ఈ గుహల్లో మానవులు జీవించేవారని భావిస్తున్నారు.
కాగా, 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని ఉద్యానవనాలను అభివృద్ధి చేసింది. గుహ లోపల రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించి పర్యాటకులను ఆకర్షిస్తున్నది. దేశంలో అత్యంత పొడవైన, లోతైన గుహలు ఇవే. ఇవి ఈ గుహ 365 రోజులు చల్లగానే ఉంటుంది. మండే వేసవిలో సైతం ఈ గుహలో చల్లని వాతావరణం ఉంటుంది.