Retreat Ceremony : పంజాబ్లోని అటారీ-వాఘా అంతర్జాతీయ సరహద్దులో జరిగే రిట్రీట్ వేడుకను చూసేందుకు చాలామంది వెళ్తారు. అయితే.. భారత, పాకిస్థాన్ సైనికులు సంయుక్తంగా నిర్వహించే ఈ వేడుకకు వెళ్లేవాళ్లు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో సీట్లను బుకింగ్ చేసుకోవాలి. రిట్రీట్ సెరమొనీ టికెట్లను సందర్శకులు జనవరి 1 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని భారత సరిహద్దు సేవాదళం మంగళవారం తెలిపింది. అయితే.. అందుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సందర్శకులు రిట్రీట్ సెరమొనీని వెళ్లాలనుకున్న రోజుకు రెండు రోజలు ముందు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ బుకింగ్ కోసం బీఎస్ఎఫ్ https://attari.bsf.gov.in వెబ్పోర్టల్ను లాంచ్ చేసింది. అందులో ఫొటో ఐడీ కార్డులో వివరాలు నింపాలి. ఒక గ్రూప్లో 12 మందికి మాత్రమే సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. బుకింగ్ తర్వాత సందర్శకుల రిజిష్టర్ మొబైల్ నంబర్కు మెసేజ్ వస్తుంది.
ప్రస్తుతం అటారీ-వాఘా సరిహద్దుకు వెళ్లిన సందర్శకులకు బీఎస్ఎఫ్ దళాలు ఐడీ కార్డు జారీ చేస్తున్నాయి. ఆ తర్వాత వాళ్లను గ్యాలరీలోకి అనుమతిస్తారు. అటారీ- వాఘా సరిహద్దు పంజాబ్లోని అమృత్సర్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజు ఇక్కడ భారత్- పాక్ దేశాల జాతీయ జెండా అవనతం, రీట్రీట్ సెరమొనీ నిర్వహిస్తారు. ఈ వేడుకని చూసేందుకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా వెళ్తారు. రోజుకు దాదాపు 25వేల మంది ఈ సెరమొనీకి హాజరవుతారు. సెలవు రోజులు, స్వాతంత్రదినోత్సవం, గణతంత్ర దినోవ్సవం రోజున సందర్శకుల సంఖ్య 40వేలు దాటుతుంది.