Bombay High Court | ముంబై: బాంబే హైకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నాగ్పూర్ బెంచ్కు అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ రోహిత్ డియో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోర్టులోనే ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా కోర్టుకు క్షమాపణ చెప్పిన ఆయన.. తనకు ఎవరి పట్ల ద్వేషం లేదని స్పష్టం చేశారు. న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినందుకు విచారిస్తున్నానని చెప్పారు.
రాజీనామాకు స్పష్టమైన కారణమేమిటో వెల్లడించలేదు. ఆత్మగౌరవానికి విరుద్ధంగా పనిచేయలేనని జస్టిస్ డియో పేర్కొన్నట్టు ఓ న్యాయవాది తెలిపారని పీటీఐ వెల్లడించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ డియో నిరుడు నిర్దోషిగా ప్రకటించడంతోపాటు జీవిత ఖైదును రద్దు చేశారు. దీంతో ఆ తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. కేసును పునఃపరిశీలించాల్సిందిగా నాగ్పూర్ బెంచ్ను ఆదేశించింది.