ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక దర్యాప్తు అధికారి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు జరిపిన కోర్టు ఆయన పిటిషన్ను గురువారం కొట్టివేసింది.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే కోట్లలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షులైన ప్రభాకర్ సెయిల్, లాయర్లు సుధా ద్వివేది, కనిష్క జైన్, నితిన్ దేశ్ముఖ్ నాలుగు ఫిర్యాదులు చేశారు. ఆర్యన్ ఖాన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఎన్సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని, ఇందులో రూ.8 కోట్లు సమీర్ వాంఖడే కోసమని ఆరోపించారు.
ఈ ఫిర్యాదులపై దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నలుగురు ముంబై పోలీస్ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నదని మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక వేళ సమీర్ వాంఖడేపై ఏదైనా కేసు నమోదై ఆయనను అరెస్టు చేయాల్సి వస్తే 72 గంటల ముందుగా నోటీసు ఇస్తామని తెలిపారు. దీంతో సమీర్ వాంఖడే పిటిషన్ను బాంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది.