SpiceJet | న్యూఢిల్లీ : బీహార్లోని దర్భంగా నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో స్పైస్జెట్ అధికారులు.. పైలట్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను కిందకు దింపి, విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అయితే బాంబు బెదిరింపు కాల్ బోగస్ కాల్ అని పోలీసులు తేల్చారు. ఈ బెదిరింపు కాల్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్ స్పైస్జెట్ రిజర్వేషన్ కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో నిర్మానుష్య ప్రదేశంలో విమానాన్ని ల్యాండ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అటు ఎయిర్పోర్టు సిబ్బంది, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.