Gurugram : హరియాణాలోని గురుగ్రామ్ (గుర్గావ్) మున్సిపల్ ఆఫీసుకు, మేయర్ ఆఫీసుకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ మున్సిపల్ కార్యాలయానికి గురువారం ఒక మెయిల్ వచ్చింది. ప్రో ఖలిస్తాన్ గ్రూప్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
మెయిల్ ప్రకారం.. గురుగ్రామ్ మున్సిపల్ కార్యాలయంతోపాటు, మేయర్ ఆఫీసులోనూ బాంబులు పెట్టారు. హరియాణాను ఖలిస్తాన్గా మారుస్తామని, దర్బార్ సాహిబ్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ మెయిల్పై మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సెక్టార్ 34లో ఉన్న మున్సిపల్ ఆఫీసుకు, మేయర్ ఆఫీసుకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్న సిబ్బంది, నేతలు, సందర్శకులను అక్కడినుంచి బయటకు పంపించారు. బాంబ్ స్క్వాడ్ కూడా సోదాల్లో పాల్గొంటున్నారు. రెండు ఆఫీసుల్లో, మొత్తం ప్రాంగణంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఎలాంటి బాంబ్ను అధికారులు గుర్తించలేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో గోల్డెన్ టెంపుల్ నుంచి దుండగుల్ని బయటకు పంపించారు. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణల గురించి కూడా తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వార్షికోత్సవానికి రెండు రోజులు ముందు హరియాణాలోని గురుగ్రామ్ మున్సిపల్ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం సంచలనం కలిగించింది. మరోవైపు సిక్కుల్లో ఒక వర్గం తమను ప్రత్యేకంగా విభజించి, ఖలిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాల్లోని కొన్ని అసాంఘిక శక్తులు ఈ డిమాండ్కు మద్దతు ఇస్తున్నాయి.