భువనేశ్వర్: సుమారు వెయ్యి కోట్లకు సంబంధించిన ఆన్లైన్ పాంజీ స్కామ్ విచారణలో భాగంగా బాలీవుడ్ నటుడు గోవింద(Govinda)ను ఒడిశాకు చెందిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ప్రశ్నించనున్నది. సోలార్ టెక్నో అలియనెస్స్ ఆన్లైన్ ద్వారా భారీ స్కామ్కు పాల్పడింది. పలు దేశాల్లో ఈ గ్రూపు ఆపరేషన్లో ఉంది. క్రిప్టో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ పాంజీ స్కామ్ విచారణలో భాగంగా నటుడు గోవిందను కూడా ప్రశ్నించాలని ఈఓడబ్ల్యూ నిర్ణయించింది. కంపెనీకి చెందిన కొన్ని ప్రమోషనల్ వీడియోల్లో నటుడు గోవింద ప్రచారకర్తగా చేశాడు. ముంబైలో గోవిందను ప్రశ్నించేందుకు అక్కడకు ఓ బృందాన్ని పంనున్నట్లు ఈఓడబ్ల్యూ ఇన్స్పెక్టర్ జనరల్ జేఎన్ పంకజ్ తెలిపారు.
నటుడు గోవింద ఆ కేసులో అనుమానితుడో లేక నిందితుడో కాదని, కానీ విచారణ తర్వాత ఆయన పాత్ర ఏంటో తెలియనున్నట్లు ఆఫీసర్ వెల్లడించారు. ఒకవేళ ఆయన ఆ కంపెనీ ఉత్పత్తుల్ని మాత్రమే ప్రచారం చేస్తే, అప్పుడు ఆయన్ను ఈ కేసులో సాక్షిగా చూడనున్నట్లు పోలీసు ఆఫీసర్ పంకజ్ తెలిపారు. భద్రక్, కీన్జర్, బాలాసోర్, మయూర్బంజ్, భువనేశ్వర్ ప్రాంతాలకు చెందిన సుమారు పదివేల మంది నుంచి దాదాపు 30 కోట్లు వసూల్ చేశారు.
బీహార్, యూపీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో డిపాజిటర్ల నుంచి లక్షల మొత్తంలో అమౌంట్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి అధిపతిగా ఉన్న గుర్జీత్ సింగ్ సిద్దూ, నిరోద్ దాస్లను ఆర్థికశాఖ అరెస్టు చేసింది.