చండీగఢ్: చిన్నారులైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆదివారం రాత్రి కనిపించకుండాపోయారు. అయితే ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెలో వారి మృతదేహాలు కనిపించాయి. (Missing Sisters Found dead in Trunk) ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. కాన్పూర్ గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న వలస కూలీ కుటుంబంలో ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు బాలికలైన ముగ్గురు పిల్లలు కనిపించలేదు. సోదరీమణులైన నాలుగేళ్ల కాంచన్, ఏడేళ్ల శక్తి, తొమ్మిదేళ్ల అమృత కోసం రాత్రి వరకు వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో వారి మిస్సింగ్పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, సోమవారం ఇంటి సామాన్లు తరలిస్తుండగా ట్రంకు పెట్టె బరువుగా ఉండటాన్ని తండ్రి గమనించాడు. దానిని తెరిచి చూడగా ముగ్గురు కుమార్తెల మృతదేహాలు అందులో కుక్కి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. తనకు మద్యం తాగే అలవాటు ఉండటంతో ఇంటిని ఖాళీ చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యజమాని ఇటీవల హెచ్చరించినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.