Boat Capsize | బిహార్ ముజఫర్పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. భాగమతి నదిపై మధుపూర్ పట్టిఘాట్ సమీపంలో గురువారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన విద్యార్థుల పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. మరికొంత మందిని స్థానికులు రక్షించారు. అయితే, ఉదయం ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
అయితే, ఇప్పటి వరకు ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు. దీంతో ఆయా విద్యార్థుల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇంట్లకు తిరిగి వచ్చారా? అంటూ విద్యార్థుల ఇండ్లకు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్కు ముజఫర్పూర్ సమీపంలోని భాగమతి నదిలో పడవ బోల్తాపడినట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ బిహార్ యూనిట్ డిప్యూటీ కమాండెంట్ రణధీర్ సింగ్ తెలిపారు.
సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో 25-30 మంది ఉన్నారని, ఇప్పటి వరకు దాదాపు 20 వరకు సురక్షితంగా ఉన్నారని స్థానిక అధికారుల నుంచి సమాచారం అందిందని, ఇంకా ధ్రువీకరించాల్సి ఉందన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం డైవర్ల బృందం గాలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలంలో ఉందని వివరించారు.