Board Exams | పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బోర్డు పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంలో (NEP-2020) విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరం నుంచి రెండుసార్లు 10, ఇంటర్ విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ (NCF) ప్రకారం.. విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం ఇవ్వడానికి బోర్డు పరీక్షలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యతో వారిని సంపన్నం చేయడం, విద్యార్థులను సంస్కృతితో అనుసంధానం చేయడం, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడం జాతీయ విద్యా విధానం ఉద్దేశమన్నారు.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ మాతృభాషలో చదుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం రాబోయే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ట్రాన్స్లేషన్ చేయాలని ఎన్సీఈఆర్టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (NIOS)తోపాటు కేంద్రీయ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలను విద్యాశాఖ ఆదేశించింది. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం-2020 సిఫారసు చేసిన విషయం తెలిసిందే. బీటెక్ కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతి ఇస్తుండగా.. మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే ప్రారంభమైంది.
పీఎంశ్రీ పథకంపై కేంద్రమంత్రి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లోని 211 పాఠశాలలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అప్గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కోదానికి రూ.2కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని, నాలుగేళ్లలో జరిగే ఈ ఈవెంట్లో దేశానికి 10శాతం పతకాలు ఛత్తీస్గఢ్కు చెందిన అథ్లెట్ల నుంచే రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్రంలోని క్రీడాకారులు ఈ ఏడాది నుంచే సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.