BMTC conductor : బెంగళూరు నగరం (Bengalore City) లో బస్సు ప్రయాణికులు నిత్యం ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో కర్ణాటక రవాణా శాఖ మంత్రి (Karnataka Transport) బైరతి సురేష్ (Bairati Suresh) స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. గత రాత్రి ఆయన మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిగా బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అడిగినంత చిల్లర ఇవ్వలేకపోయినందుకు మంత్రిని బస్సు దిగిపోవాలంటూ బీఎంటీసీ (BMTC) బస్సు కండక్టర్ (Conductor) కోరడంతో ఆయన షాక్ అయ్యారు.
గత రాత్రి బస్సుల్లో తనిఖీకి మంత్రి బైరతి సురేష్ బయలుదేరారు. హెబ్బాళ్ నుంచి నాగశెట్టిహళ్లికి వెళ్లే బీఎంటీసీ బస్సు ఆయన ఎక్కారు. మాస్క్ ధరించిన మంత్రి.. రాత్రి 7:10 గంటల నుండి 9:10 గంటల మధ్య జయమహల్, టీవీ టవర్, ఆర్టీ నగర్, సీబీఐ రోడ్, హెబ్బాల్, మాన్యతా టెక్ పార్క్, నాగవార, హెన్నూర్, హెన్నూర్ బండే, బైరతి బండే, గెద్దలహళ్లి రూట్లలో బస్సుల్లో ప్రయాణించి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు టిక్కెట్లు కావాలని కోరుతూ మంత్రి రూ.100 నోటు ఇచ్చారు. మంత్రిని గుర్తించని కండక్టర్.. చిల్లర ఇవ్వాలని కోరాడు.
తన వద్ద చిల్లర లేదని మంత్రి చెప్పగా తన వద్ద కూడా చిల్లర లేదని చెబుతూ కండక్టర్ తన బ్యాగ్ తెరిచి చూపించాడు. చిల్లర ఇవ్వలేకపోతే బస్సు దిగాల్సిందేనని కండక్టర్ పట్టుబట్టాడు. దీంతో మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండానే బస్సు దిగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణ ప్రజల మాదిరిగా మంత్రి మారు వేషంతో తనిఖీకి వెళ్లడంతో సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్గా మారింది. మంత్రిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.