Shooting in Begusarai | బీహార్లోని బెగుసరాయిలో మంగళవారం రాత్రి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు దారుణానికి దిగారు. జాతీయ రహదారి -28, జాతీయ రహదారి-31లపై ఆరు ప్రాంతాల్లో విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక యువకుడు మరణించగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నగరంలోని వివిధ ప్రైవేట్ దవాఖానలకు తరలించారు. ఈ ఘటనను బెగు సరాయి ఎస్పీ యోగేంద్ర కుమార్ ధృవీకరించారు. నిందితులను పట్టుకునేందుకు జిల్లా వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.
కాల్పుల్లో మరణించిన వ్యక్తిని చందన్ కుమార్ అని గుర్తించారు. బెగు సరాయిలోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విశాల్ సోలంకి అనే వ్యక్తి టీవీఎస్ క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. మరో మత్స్యకారుడికి గాయాలయ్యాయి. కాల్పుల ఘటన తర్వాత బీజేపీ నేత రజనీశ్ కుమార్.. గాయపడిన వారిని పరామర్శించారు. నితీశ్ కుమార్ సర్కార్పై నిప్పులు చెరిగారు. బెగు సరాయి జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని అన్నారు. ఆగంతకుల్లో ఏమాత్రం భయం లేదన్నారు.
కాల్పులు జరిగిన సంగతి వాస్తవమేనని స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ధృవీకరించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 12 మందికి గాయాలయ్యాయని, అధికారుల ధృవీకరణ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.