న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తో సతమతమవుతున్న ఇండియాకు ఇది మరో బ్యాడ్ న్యూస్. ఈ మహమ్మారి కారణంగా బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువ అవుతున్నట్లు ఢిల్లీ డాక్టర్లు గుర్తించారు. సాధారణంగా అవయవ మార్పిడి, ఐసీయూలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు రోగాల బారిన పడటం లేదా చనిపోవడానికి ఈ బ్లాక్ ఫంగస్ కారణమవుతుందని ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ డాక్టర్లు చెబుతున్నారు.
ఏంటీ బ్లాక్ ఫంగస్?
మ్యూకోర్మికోసిస్నే సాధారణ పరిభాషలో బ్లాక్ ఫంగస్ అంటారు. ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే కొవిడ్ కారణంగా ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. గత రెండు రోజుల్లోనే ఈ బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న వాళ్లు ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నట్లు గంగారామ్ హాస్పిటల్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ మనీష్ ముంజాల్ వెల్లడించారు. గతేడాది కరోనా తొలిసారి వచ్చినప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అందులో చాలా మంది కంటిచూపు కోల్పోయిన వాళ్లు, ముక్కు, దవడ ఎముక తీసేయాల్సి వచ్చిన వాళ్లు ఉన్నట్లు డాక్టర్ మనీష్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ ఎలా వస్తోంది?
కొవిడ్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఎలా వస్తోందో ఇదే హాస్పిటల్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు. కొవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను వాడటంతోపాటు డయాబెటిస్ (షుగర్) ఉన్న కొవిడ్ పేషెంట్లలో ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ అంతకుముందే డయాబెటిస్, కిడ్నీ, గుండె వైఫల్యాలు, క్యాన్సర్తో బాధపడుతూ కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు.
అందులోనూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కొవిడ్ పేషెంట్లు ఈ బ్లాక్ పంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనిని త్వరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమని డాక్టర్ ముంజాల్ చెప్పారు. ముక్కులో అడ్డంకి, కళ్లు లేదా చెంపల్లో వాపు, ముక్కులో నల్లటి పొక్కుల్లాంటివి కనిపిస్తే వెంటనే బయాప్సీకి పంపించి యాంటీఫంగల్ థెరపీ చేయాలని సూచించారు.