న్యూఢిల్లీ : 2021లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదను ఉద్దేశించి అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ జితిన్ ప్రసాద సిబల్పై విమర్శలు గుప్పించారు. ఏడాది కిందట జితిన్ ప్రసాద బీజేపీలో చేరడాన్ని విమర్శించిన సిబల్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా ఎస్పీ మద్దతుతో బుధవారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ సమర్పించారు.
గత ఏడాది జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన సమయంలో అసలు జితిన్కు బీజేపీ నుంచి “ప్రసాదం” దక్కిందా లేక యూపీ ఎన్నికల కోసం కాషాయ పార్టీ వలలో చిక్కుకున్నారా అంటూ సిబల్ ట్వీట్ చేశారు. ఇలాంటి ఒప్పందాల్లో సిద్ధాంత వైరుధ్యాలు ఏమీ ఉండవని సులభంగా పార్టీ మార్చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై జితిన్ ప్రసాద స్పందిస్తూ ప్రసాదం ఎలా ఉంది సిబల్ జీ అని ట్వీట్ చేశారు. కాగా తాను మే 16నే కాంగ్రెస్కు రాజీనామా చేశానని కపిల్ సిబల్ విలేకరులతో పేర్కొన్నారు.
2024 ఎన్నికలకు అఖిలేష్ యాదవ్తో సహా ఎంతో మంది నేతలు తనతో కలిసివస్తున్నారని చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాము కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు దిగ్గజ నేతలు వరుసగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్, పటేల్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్, మాజీ కేంద్ర మంత్రులు అశ్వనీ కుమార్, ఆర్పీఎన్ సింగ్ వంటి నేతలు పార్టీకి రాజీనామా చేశారు.