బెంగళూరు: ఒక బీజేపీ నేత మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్లారు. దీంతో ఆయన తీరును కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 19న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కర్ణాటకలోని కార్వార్ జిల్లాను సందర్శించారు. శివాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత షిరాలోని భత్కల్ ఎమ్మెల్యే సునీల్ నాయక్ నివాసానికి సీటీ రవి వెళ్లారు. అక్కడ మాంసాహారం తిన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నాయక్ ఇంట్లో చేపల కూరతో భోజనం చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.
కాగా, మధ్యాహ్న భోజనం అనంతరం స్థానిక బీజేపీ కార్యాలయాన్ని సీటీ రవి సందర్శించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత, రాజాంగన నాగబాణ ఆలయాన్ని సందర్శించారు. ఆ గుడి మూసి ఉండటంతో బయట నుంచి దండం పెట్టుకున్నారు. అనంతరం సమీపంలోని కరిబంట ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, నాన్ వెజ్ ఫుడ్ తిన్న తర్వాత ఆలయాలకు వెళ్లడంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. గుడికి వెళ్లిన తర్వాత మాంసాహారం తిన్నట్లుగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై ఇటీవల బీజేపీ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ఇతరులు చేస్తే తప్పు, బీజేపీ నేతలు చేస్తే ఒప్పా? అని ప్రశ్నించారు. హిందుత్వ అంటే ఇదేనా అని విమర్శించారు.