పేదల పట్ల జాలిలేని తనం’, ‘అధికార అహంకారం’-యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ అప్పటి గుజరాత్ సీఎం, ప్రస్తుత ప్రధాని మోదీ చేసిన ట్వీట్లు ఇవి. తాము అధికారంలోకి వస్తే కొండెక్కిన చమురు ధరలను నేలకు దించుతామని ఊదరగొట్టిన ప్రధాని.. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా పెట్రో ధరలను పెంచేస్తున్నారు. అయితే, ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధంలేకుండా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఈ పెట్రోవాత కొనసాగుతున్నది. ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంతవరకూ పెట్రో ధరలను పెంచని కేంద్రం ఫలితాలు వెల్లడైన తర్వాత ఇంధన వాతకు పూనుకొన్నది. అలా పెట్రోల్, డీజిల్పై రోజుకు ఒక రూపాయి చొప్పున పెంచుకుంటూ వస్తున్నది.
13 రాష్ర్టాల్లోని 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. పార్టీ ఓటమికి.. అప్పటికే రోజూవారీగా పెంచుతున్న పెట్రోల్ ధరలు కూడా ఓ కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఫలితాలు వెల్లడైన మరుసటిరోజునే అంటే నవంబర్ 3న లీటర్ పెట్రోల్పై రూ. 5, లీటర్ డీజిల్పై రూ. 10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, అప్పటివరకూ రోజూ రూ. 35 పైసల చొప్పున పెంచుతూ వస్తున్న ఇంధనవాతకు కూడా తాత్కాలికంగా విరామం ప్రకటించింది. అలా నవంబర్ 4, 2021 నుంచి దాదాపు నాలుగున్నర నెలలపాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులూ లేవు. ఈ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 25 శాతం వరకు పెరిగింది. అయినప్పటికీ, ఇంధన ధరలను ఏ మాత్రం పెంచలేదు.
ఐదురాష్ర్టాల ఎన్నికలు ముగిశాక చమురువాతను కేంద్రం మళ్లీ మొదలుపెట్టింది. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్పై రోజుకు రూ. 1 చొప్పున వడ్డిస్తూ వస్తున్నది. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలను పెంచిన కేంద్రం.. ఏకంగా 10 శాతం వరకు ధరలను పెంచింది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తక్కువ ధరకే క్రూడాయిల్ను సరఫరా చేస్తామని రష్యా ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు దాదాపు 10 డాలర్లు క్షీణించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇంధన ధరలను పెంచుకుంటూపోతూనే ఉన్నది. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పలు దేశాల్లో పెట్రోల్ ధరలు 50 శాతం వరకూ పెరుగ్గా, మన దేశంలో మాత్రం కేవలం 5 శాతమే పెరిగాయని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ధరల పెంపును సమర్థించుకోవడం హాస్యాస్పదం.