ధన్బాద్: జార్ఖండ్లో బీజేపీ కార్యకర్తలు ముస్లిం యువకుడిపై దాడికి దిగారు. బింగీలు తీయించి, రోడ్డుపై ఉమ్మి నాకించారు. ఇదంతా బీజేపీ ఎంపీ పీఎన్ సింగ్, ఎమ్మెల్యే రాజ్ సిన్హా సమక్షంలోనే జరగడం విశేషం. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మిన్నకుండిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యాలకు వ్యతిరేకంగా జార్ఖండ్లోని ధన్బాద్లో ఉన్న గాంధీ చౌక్లో బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. దీనికి స్థానిక ఎంపీ, బీజేపీకి చెందిన పీఎన్ సింగ్, ఎమ్మెల్యే రాజ్ సిన్హా నేతృత్వం వహించారు. ఈ క్రమంలో అటుగా వేళ్తున్న ఓ ముస్లిం యువకుడు ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల దుర్భాషలాడాడని ఆరోపిస్తూ.. అతనిపై దాడి చేశారు. విడిచిపెట్టాలని చేతులెత్తి దండం పెట్టినా పట్టించుకోలేదు. అతన్ని మోకాళ్లపై కూర్చోబెట్టారు, జై శ్రీరామ్ అనాలని ఒత్తిడి చేశారు. బింగీలు తీయించడంతోపాటు రోడ్డుపై ఉమ్మి నాకించారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు అతడిని రక్షించే ప్రయత్నం చేయలేదు.
అయితే ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, బాధితునికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.