చెన్నై : కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ స్ధానాల్లో మహిళలకు గుర్తింపు ఉండదని, వారిని కీలక పదవుల్లో ప్రోత్సహించరని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఇటీవల కాషాయ పార్టీలో చేరిన ఎస్. విజయధరణి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సరైన వేదిక లేదని, 14 ఏండ్లుగా తాను మినహా కాంగ్రెస్ పార్టీలో మహిళా ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరని ఆమె పేర్కొన్నారు. తనను సైతం కాపాడుకోలేని దుస్ధితిలో ఆ పార్టీ ఉండటం విచారకరమని వ్యాఖ్యానించారు.
మహిళలకు పార్టీలో పలు అవరోధాలు సృష్టిస్తారని, వారి కుయుక్తులు భరించలేక ఆ పార్టీలో చేరిన 37 ఏండ్ల అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆరోపించారు. నాయకత్వ పదవులు మహిళలకు ఇవ్వరాదనే పద్ధతి సరైంది కాదని కాంగ్రెస్కు ఆమె హితవు పలికారు. మహిళను కేవలం ఎమ్మెల్యే అవడంతోనే ఎందుకు ఆపాలని ప్రశ్నించారు. ఏడేండ్ల పాటు పార్టీ తనను ఎదగనివ్వలేదని ఆరోపించారు.
బీజేపీ మహిళల్లో నాయకత్వ లక్షణాలను గుర్తించి అర్ధం చేసుకున్నందునే తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. విల్వన్కోడ్ ఎమ్మల్యే విజయధరణి రాజీనామాను ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చారని, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని ఆమె ప్రశంసలు గుప్పించారు. కన్యాకుమారి జిల్లాలో బీజేపీకి గట్టి పట్టున్న విల్వన్కోడ్ నియోజకవర్గం నుంచి 2021లో విజయధరణి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Read More :
Gruha Jyoti | హైదరాబాద్లో 11 లక్షల మందికే గృహజ్యోతి?