పాట్నా: వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వంద కంటే తక్కువ సీట్లు వస్తాయని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. అయితే దీని కోసం ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని మరోసారి పిలుపునిచ్చారు. పాట్నాలో ఆదివారం జరిగిన సీపీఎం 11వ మహాసభలో నితీశ్ కుమార్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిచేందుకు కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ చేతులు కలపాలని సూచించారు. ‘యునైటెడ్ ఫ్రంట్’గా ఏర్పడితేనే బీజేపీని వంద సీట్ల కంటే తక్కువకు తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘వారు (కాంగ్రెస్) నా సూచనను స్వీకరించి కలిసి పోరాడితే, బీజేపీ 100 సీట్ల కంటే దిగువకు వెళ్తుంది. కానీ వారు (కాంగ్రెస్) నా సూచనను తీసుకోకపోతే, ఏమి జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ మాజీ మిత్రపక్షం కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన అన్నారు.
కాగా, ప్రధానమంత్రి కావాలనే ఆశ తనకు లేదని నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆ పదవి కోసం తాను పోటీ కూడా పడబోనని పునరుద్ఘాటించారు. ‘దేశాన్ని ఏకం చేయడం, విద్వేషాలను వ్యాప్తి చేసే వ్యక్తుల నుంచి విముక్తి చేయడమే నా ఏకైక ఆశయం. నాకు నిజంగా ఏమీ వద్దు. మేం మీతో పాటు ఉంటాం’ అని ఆయన అన్నారు. దీనిని నిజం చేయడానికి, విపక్షాలు కలిసి వచ్చేందుకు తాను ప్రయత్నిస్తూనే ఉంటానని నితీశ్ కుమార్ గతంలో కూడా చెప్పారు. అయితే పార్టీలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | I want you people (Congress) to take a quick decision. If they take my suggestion & fight together, they (BJP) will go below 100 seats, but if they don't take my suggestion, you know what will happen: Bihar CM Nitish Kumar at 11th General Convention of CPI-M, Patna pic.twitter.com/StbAEOjgWE
— ANI (@ANI) February 18, 2023