చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ( Punjab Polls ) నేపథ్యంలో అక్కడి వాతావరణం పూర్తిగా హీటెక్కింది. వివిధ స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక, ప్రచారాల కోసం వ్యూహరచన, కూటముల్లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లాంటి వాటి కోసం చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలన్నీ ఆ పనుల్లో బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్-సంయుక్త్ పార్టీల కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది.
పంజాబ్లో ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, బీజేపీ కూటమిగా బరిలో దిగేవి. అయితే గతంలో కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలు ఆ రెండు పార్టీల తెగదెంపులకు కారణమయ్యాయి. అదే సమయంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధూతో వివాదం కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ తన పదవిని, పార్టీని వదిలేసి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస పార్టీని స్థాపించారు.
శిరోమణి దూరం జరుగడంతో ఒంటరయిన బీజేపీ ఇప్పుడు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. పంజాబ్లో మరో చిన్నపార్టీ అయిన శిరోమణి అకాలీదళ్-సంయుక్త్ వీరితో జతకలిసింది. ఇవాళ ఈ కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. పంజాబ్లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 65 స్థానాల్లో, పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37 స్థానాల్లో, శిరోమణి సంయుక్త్ 15 స్థానాల్లో బరిలో దిగనున్నాయి.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రెండు పార్టీల అధ్యక్షులు భేటీ అయ్యారు. ముగ్గురు అన్ని అంశాలపై చర్చించి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేదానిపై ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నడ్డా అధికారికంగా ప్రకటన చేశారు.