న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను చేర్చుకోవడంపై అధికార బీజేపీపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ ఫిరాయింపుదారులను చేర్చుకోవడానికి, వారి రాజకీయ స్థానాలను ప్రక్షాళన చేయడానికి బీజేపీ తన ‘వాషింగ్ మెషీన్’ రాజకీయాలను ఉపయోగిస్తున్నదని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘బీజేపీ వాషింగ్ మెషీన్ మోదీ వాషింగ్ పౌడర్తో మళ్లీ వచ్చేసింది. సద్గుణం, నిజాయితీ, సిద్ధాంతాలకు ప్రతీకలమని తమను తాము ప్రదర్శించుకున్న వారు దారుణంగా బట్టబయలయ్యారు.’ అని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, పార్టీ మారిన వ్యక్తులను లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వారి గత బహిరంగ వైఖరులకు, ప్రస్తుత రాజకీయ సిద్ధాంతాలకు మధ్య వైరుధ్యం ఉందని అన్నారు. కాగా, దీనిపై బీజేపీ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అప్పటివరకు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న విపక్ష నేతలు బీజేపీలో చేరిన వెంటనే పరిశుద్ధులుగా మారిపోవడాన్ని కాంగ్రెస్ విమర్శిస్తూ దానిని ‘వాషింగ్ మెషీన్ రాజకీయంగా’ అభివర్ణిస్తున్నది. అయితే కాంగ్రెస్ ఆరోపణలు బీజేపీ తిరస్కరిస్తూ వస్తున్నది. ప్రస్తుతం రాజ్యసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం కీలకంగా మారిన దశలో అధికార బీజేపీ.. ఆప్నకు చెందిన ఏడుగురు ఎంపీలను తమ పార్టీలోకి లాక్కున్న వైఖరిని విమర్శిస్తూ జైరాం రమేశ్ తాజా ఆరోపణలు చేశారు. కాగా, తమ పాలనా విధానాలు నచ్చి , తమ సిద్ధాంతాలకు ఆకర్షితులై మాత్రమే తమ పార్టీలో చేరుతున్నారని బీజేపీ పాత పాట పాడుతూ ఆ చర్యను సమర్థించుకుంటున్నది. కాగా, గత కొద్ది కాలంగా ఆప్లో జరుగుతున్న పరిణామాలు పరిశీలస్తే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలోకి మారుతారనే ప్రచారం జరిగింది. ఆయన పట్ల బీజేపీ వైఖరి కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఏకంగా ఆయన తనతో పాటు మరో ఆరుగురు పార్టీ ఎంపీలను సైతం బీజేపీలోకి తీసుకుపోవడం ఆప్కు పెద్ద షాక్ను మిగిల్చింది.
ఇటీవల పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడానిక అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడంలో అధికార బీజేపీ విఫలమైంది. దీంతో భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను ఎదుర్కోడానికి ఆ పార్టీ తన ఎంపీల బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను మళ్లీ దీనికి వినియోగించుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఎల్పీయూ యూనివర్సివటీ వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఇంటిపై పెద్దయెత్తున ఈడీ దాడులు జరగడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది! తాజగా బీజేపీలో చేరిన వారిలో ఆయన కూడా ఉన్నారు. వచ్చే ఏడాది పంజాబ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను రాజకీయంగా దెబ్బతీయడమే కాక, రాజ్యసభలో తన బలాన్ని పెంచుకోవడానికి కమలం పార్టీ పన్నిన వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు. తాను రావడమే కాక, తనతో పాటు మరో ఆరుగురిని పార్టీలోకి తెచ్చిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదకి ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.
ఎంపీల ఫిరాయింపుపై మాట్లాడేందుకు సమయం ఇవ్వండి.. రాష్ట్రపతికి ఆప్ వినతి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యులను వెనక్కి పిలిపించే విషయంపై తన వైఖరిని తెలియచేయడానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడానికి సమయం కోరారు. పంజాబ్ ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి కార్యాలయాన్ని సందర్శించాలని ఆయన యోచిస్తున్నారు. ఆప్ ఎంపీల పార్టీ ఫిరాయింపు, వారిని వెనక్కి పిలిపించే విషయాన్ని రాష్ట్రపతిని కలసినపుడు మాన్ ప్రస్తావించే అవకాశం ఉన్నది. ఆప్ రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా తదితరులు తామంతా ఒక జట్టుగా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎంపీలు బీజేపీలో చేరడంపై శనివారం స్పందించిన మాన్ వారిని ద్రోహులుగా అభివర్ణించారు. ఆప్ను చీల్చడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ పంజాబ్ ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు కేటాయించిన కొత్త బంగ్లాను మరో శీష్ మహల్ (అద్దాల మహల్)గా వర్ణిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ భవనం ఆధునీకరణకు కేజ్రీవాల్ పెద్దమొత్తంలో ఖర్చు చేశారని ఆరోపించింది. అయితే బీజేపీ తమ అధినేత లోపాలు పట్టుకోలేక ఫేక్ ప్రచారానికి దిగిందని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ కొత్త ఇంట్లోకి మారిన మరుసటి రోజే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేశ్ వర్మ ఆయన కొత్త భవనం లే అవుట్, చిత్రాలను విడుదల చేస్తూ ఆ భవనంలో ప్రైవేట్ మనీతో అత్యాధునిక సౌకర్యాలు సమకూర్చుకున్నారని విమర్శించారు.
‘విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడ్డ కేజ్రీవాల్ ‘శీష్ మహల్ 2’ను సిద్ధం చేసుకుంటున్నారు’ అని అన్నారు. ‘తెలివైన ఢిల్లీ ఓటర్లు ఎన్నికల్లో తిరస్కరించిన తర్వాత కేజ్రీవాల్ శీష్మహల్ను బలవంతంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో ఆయన అక్కడి నుంచి పంజాబ్కు మారిపోయి అక్కడ ఒక బంగ్లాను చేజిక్కించుకున్నారు. లోదీ ఎస్టేట్లోని ఆ బంగ్లాను శీష్ మహల్ 2గా తయారు చేస్తున్నారు’ అని ఆరోపించారు. బీజేపీ విమర్శలను ఆప్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఫేక్ ఫొటోలని, పింటెరెస్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినవని పేర్కొంది. కేజ్రీవాల్లో ఎలాంటి లోపాలు పట్టుకోలేని బీజేపీ ఇలాంటి అబద్ధ్దాలు, ఫేక్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నదని ఆప్ తీవ్రంగా విమర్శించింది.