RJD MP Manoj Jha | విపక్ష పార్టీలంటే అధికార బీజేపీ అగ్రనాయకత్వానికి భయం అని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా ఆరోపించారు. విపక్ష నేతలను దెబ్బ తీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విపక్ష పార్టీల కార్యక్రమాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతున్నదని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.
‘కేంద్ర దర్యాప్తు సంస్థల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఆదాయం పన్ను విభాగం (ఐటీ డిపార్ట్మెంట్) లతో విపక్ష పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నది. తమను భయపెడుతున్న విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నది’ అని మనోజ్ ఝా చెప్పారు. ‘లాండ్ ఫర్ జాబ్’ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను తొమ్మిది గంటలకు పైగా విచారించిన మరునాడే మనోజ్ ఝా వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. ఇదే కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్కు సమన్లు జారీ చేసిందని మనోజ్ ఝా ఆరోపించారు.
నాటకీయ ఫక్కీలో ‘మహాఘట్బంధన్’ ప్రభుత్వాన్ని, విపక్ష ‘ఇండియా’ కూటమిని వీడి, బీజేపీతో కలిసి ఆదివారం జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదో సారి బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. 18 నెలల క్రితం జేడీయూని వీడి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మహాఘట్బంధన్లో ఆర్జేడీ కీలక భాగస్వామ్య పక్షంగా నిలిచింది.