పట్నా: భారతీయ జనతాపార్టీ రామ్, రహీమ్ భక్తుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. మత విద్వేషాలతో లబ్ధి పొందడంలో బీజేపీ బాగా రుచి మరిగిందని ఆయన విమర్శించారు. అల్లర్లను రెచ్చగొట్టి అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారిందని లాలూ మండిపడ్డారు. కానీ దేనికైనా ఒక హద్దు అనేది ఉండాలని సూచించారు. బీజేపీ జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రాలేకపోతున్నాయని లాలూ యాదవ్ చెప్పారు. తాము అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మళ్లీమళ్లీ ప్రయత్నాలు చేశామని, కానీ కొన్ని కారణాలవల్ల ప్రతిసారీ విఫలమవుతూ వచ్చామని తెలిపారు. విపక్షాలు ఒక్కటి కాలేకపోవడంవల్లే బీజేపీ దేశాన్ని ఏలుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని చెప్పారు. పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.