(స్పెషల్ టాస్క్ బ్యూరో);హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ చేసిన ‘క్యాష్’ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2014 నుంచి ఎనిమిది రాష్ర్టాల్లో అప్రజాస్వామికంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన 171 మంది ఎమ్మెల్యేల కొనుగోలుకు ఏకంగా రూ.12,515 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలు, సంబంధిత నేతలు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ విషయం స్పష్టమవుతున్నది. తెలంగాణలో బీజేపీ కొనుగోళ్ల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో .. గడిచిన ఎనిమిదేండ్లలో బీజేపీ సాగించిన బేరాల చిట్టా బట్టబయలవ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మహారాష్ట్ర@4,600 కోట్లు
శివసేనలో చీలిక తెచ్చి ఏక్నాథ్ షిండేతో సహా 40 మంది రెబల్ ఎమ్మెల్యేలతో గువాహటిలో బీజేపీ క్యాంప్ పెట్టించింది. అనంతరం సీఎం పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయగానే, షిండేను సీఎంగా చేసి వెనకుండి మంత్రాంగాన్ని నడిపిస్తున్నది. తమకు మద్దతిస్తున్న 12 మంది స్వతంత్రులకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు చొప్పున, షిండే క్యాంపు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ లెక్కన ఎమ్మెల్యేల కొనుగోలుకు మొత్తంగా రూ. 4,600 కోట్లు కమలదళం వెచ్చించింది.
మధ్యప్రదేశ్@2,600 కోట్లు
2018 ఎన్నికల్లో 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాతోపాటు 26 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు తిప్పుకోవడంతో కమల్నాథ్ సర్కారు కూలిపోయింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, సింధియాకు కేంద్రమంత్రి పదవిని బీజేపీ కట్టబెట్టింది. 26 మంది ఎమ్మెల్యేల కోసం కమలదళం రూ. 2,600 కోట్లు వెచ్చించింది.
కర్ణాటక@1,600 కోట్లు
16 మంది ఎమ్మెల్యేలను లొంగదీసుకొని కుమారస్వామి సర్కారును పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీనికోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, క్యాబినెట్ బెర్తును ఆఫర్ చేసినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ లెక్కన మొత్తంగా రూ. 1,600 కోట్లు ఖర్చుచేసింది.
అరుణాచల్@1,600 కోట్లు
2016 జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పెమాఖండుతో తిరుగుబావుటా ఎగురవేయించి, ఆ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లు చొప్పున బీజేపీ చెల్లించినట్టు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ లెక్కన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలకు రూ. 1,600 కోట్లు కమలదళం వెచ్చించినట్టు అర్థమవుతున్నది.
గోవా@1,100 కోట్లు
2017లో జరిగిన ఎన్నికల్లో.. 40 స్థానాలకు.. 17 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం 13 సీట్లు గెలుచుకొన్న బీజేపీ ముందుగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తనవైపు లాక్కున్నది. తరువాత పదిమందిని ఫిరాయించేలా చేసింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం.
సిక్కిం@480 కోట్లు
2019లో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీకి అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు బీజేపీ రూ. 40 కోట్ల చొప్పున చెల్లించినట్టు వార్తలు వచ్చాయి.
పుదుచ్చేరి@175 కోట్లు
కాంగ్రెస్తోపాటు డీఎంకేకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకొన్నది. ఒక్కొక్కరికి రూ. 35 కోట్ల చొప్పున ఆఫర్ చేసినట్టు సమాచారం.
మణిపూర్@360 కోట్లు
2017లో జరిగిన ఎన్నికల్లో మణిపూర్లో కాంగ్రెస్ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 21 సీట్లే వచ్చిన బీజేపీ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకొని దొడ్డిదారిన అధికారం చేపట్టింది. దీని కోసం రూ. 360 కోట్లు ఖర్చుచేసింది.