పాట్నా: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి హెలికాప్టర్లో ఆహారం తీసుకున్నారు. చేప, రోటీ తిన్న వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జోరు ఎన్నికల ప్రచారం వల్ల భోజనం చేయడానికి సుమారు 15 నిమిషాల సమయం మాత్రమే లభించిందని ఆ వీడియోలో వివరించారు. అలాగే ఆ పోస్ట్లో 8వ తేదీ అని కూడా పేర్కొన్నారు.
కాగా, ఈ నెల 9 నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పూజలు ఆచరించే భక్తులు ఈ తొమ్మిది రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో తేజస్వీ యాదవ్ వీడియో క్లిప్పై బీజేపీతోపాటు పలువురు స్పందించారు. నవరాత్రుల సందర్భంగా చేప కూర తినడంపై మండిపడ్డారు. హిందువులను రెచ్చగొట్టే చర్య అని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
మరోవైపు తనను ట్రోల్ చేయడంపై తేజస్వీ యాదవ్ స్పందించారు. నవరాత్రి ప్రారంభానికి ఒక రోజు ముందు ఏప్రిల్ 8 నాటి వీడియో క్లిప్ అని తెలిపారు. బీజేపీ, ఆ పార్టీకి కొమ్ముకాసే మీడియా ఐక్యూను పరీక్షించేందుకు ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. వారి ఆలోచన తీరు గురించి తాము అనుకున్నది కరెక్టేనని నిరూపించారంటూ ఎద్దేవా చేశారు. కనీసం వీడియో క్లిప్లో పేర్కొన్న తేదీని కూడా గమనించకుండా ట్రోల్ చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.
चुनावी भागदौड़ एवं व्यस्तता के बीच हेलिकॉप्टर में भोजन! दिनांक- 08/04/2024 #TejashwiYadav #bihari #politics #Bihar #biharifood #बिहार #india pic.twitter.com/JIfgbXfQpP
— Tejashwi Yadav (@yadavtejashwi) April 9, 2024