న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్పై కాషాయ పార్టీ విమర్శలు గుప్పించింది. స్వాతి మలివాల్ను ఓ కారు డ్రైవర్ వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెను పది, పదిహేను మీటర్లు ఈడ్చుకువెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఢిల్లీ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆమె ఈ ఆరోపణలతో ముందుకొచ్చిందని, వేధింపుల వీడియోను డ్రామాగా బీజేపీ కొట్టిపారేసింది.
ఈ ఘటనపై 48 గంటల పాటు డీసీడబ్ల్యూ చీఫ్ ఎందుకు మౌనంగా ఉన్నారని, అసలు ఆమె ఉద్దేశం ఏంటని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి హరీష్ ఖురానా ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల నైతిక స్ధైర్యం దెబ్బతీసేందుకే ఈ బూటకపు వీడియోను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పోలీసులను భ్రష్టుపట్టించేందుకే ఈ వీడియోను రూపొందించారని ప్రతి ఒక్కరికీ తెలుసునని పేర్కొన్నారు. బీజేపీ విమర్శలను స్వాతి మలివాల్ తోసిపుచ్చారు. బాధితులనే బీజేపీ నిందిస్తోందని ఆమె కాషాయ పార్టీ తీరును తప్పుపట్టారు.
ఘటన జరిగిన వెంటనే తాను 112కు డయల్ చేశానని, కాల్స్ డిస్కనెక్ట్ కావడంతో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఆపి ఫిర్యాదు చేశానని, ఆపై నిందితుడిని అరెస్ట్ చేశారని ఆమె వివరించారు. బాధితులని అవమానించే వారి గురంచి తాను మాట్లాడదలుచుకోలేదని అన్నారు. వీడియో ఆధారాలే అన్నీ చెబుతున్నాయని, సమాజంలో ఇలాంటి ప్రతిస్పందన వల్లే మహిళలు తమపై జరిగే నేరాల గురించి ధైర్యంగా వెల్లడించలేకపోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.