కోల్కతా, జూన్ 11: మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చెలరేగిన మంటలు ఇంకా చల్లారడం లేదు. శనివారం పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో పాంచ్లా బజార్ ప్రాంతంలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇండ్లకు నిప్పు పెట్టారు. స్థానిక బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనల సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించాల్సి వచ్చింది. హౌరా జిల్లా వ్యాప్తంగా సోమవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హౌరా సహా ఉలుబేరియా, డోమ్జుర్, పాంచ్లాలో 15వ తేదీ వరకు కర్ఫ్యూ విధించారు. హింసకు కారకులైన 53 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
హౌరాలో హింస వెనుక కొన్ని రాజకీయ పార్టీల హస్తం ఉందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ‘బీజేపీ చేసిన పాపానికి ప్రజలు ఇబ్బందులు పడాలా’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హింస చెలరేగుతుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి కొంత మంది ప్రయత్నిస్తారని తాను ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, శనివారం హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశానికి వెళ్తుండగా బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్ను పోలీసులు మార్గమధ్యలో అరెస్టు చేశారు. నాలుగు గంటల తర్వాత విడుదల చేశారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్పై శనివారం కోల్కతాలో కేసు నమోదైంది.
జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్టు శనివారం అధికారులు తెలిపారు. దీంతో నగరంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా 2,500 మందికి పైగా పోలీసులు మోహరించారు. ఇంటర్నెట్ను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. శుక్రవారం రాంచీలో హింసాత్మక ఘటనల్లో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. సీనియర్ ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా గాయాలతో దవాఖానలో చేరారు. రాంచీలో శుక్రవారం చెలరేగిన హింసపై దర్యాప్తునకు జార్ఖండ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు, రాంచీలోని సూర్య మందిరంపై శుక్రవారం రాత్రి పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. దాడి సమయంలో పూజారి, ఆయన కుటుంబం ఆలయ ఆవరణలోనే నిద్రపోతున్నారు. దుండగులు నాలుగు పెట్రోల్ బాంబులు విసిరినట్టు తెలిసింది.
యూపీలో శుక్రవారం హింసాత్మక ఘటనలకు సంబంధించి యోగి సర్కారు 255 మందిని అరెస్టు చేసింది. శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని చూసేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం ఆదిత్యనాథ్ హెచ్చరించారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దన్నారు. సంఘవిద్రోహ శక్తులకు యూపీలో స్థానం లేదన్నారు. శుక్రవారం ప్రయాగ్ రాజ్లో హింసకు ప్రధాన కారకుడైన మహమ్మద్ జావెద్ను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్లపై చర్యలు తీసుకోవాలంటూ ఔరంగాబాద్లో నిరసనలు తెలిపిన దాదాపు 100 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు.
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంపై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘మహ్మద్ ప్రవక్త ఈ రోజు బతికి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతోన్మాదుల పిచ్చి చర్యలను చూసి షాక్ అయ్యేవారు’అని ట్వీట్ చేశారు.
యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ ‘శుక్రవారం తర్వాత శనివారం వస్తుంది..’ అంటూ బుల్డోజర్ల ఫొటోతో శనివారం ట్వీట్ చేశారు. కాన్పూర్ హింసలో అరెస్టు అయిన ఇద్దరు నిందితుల ఇండ్లను శరణ్పూర్ మునిసిపాలిటీ అధికారులు బుల్డోజర్లతో శనివారం కూల్చివేశారు. నిందితులు ముజమ్మిల్, అబ్దుల్ వకార్ నిబంధనలకు విరుద్ధంగా, ఆక్రమిత ప్రదేశంలో ఇండ్లు కట్టుకొన్నారని అందుకే కూల్చివేశామని అధికారులు తెలిపారు. ఈ కేసులో శరణ్పూర్కు చెందిన 64 మంది అరెస్టు అయ్యారు. మరోవైపు, కాన్పూర్ హింసలో ప్రధాన నిందితుడు జాఫర్ హయత్ హష్మీకి చెందిన పలు స్థిరాస్తులను పోలీసులు ధ్వంసం చేశారు. ఆయన బంధువు మహ్మద్ ఇస్తాయక్ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు.