Omar Abdullah : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ.. ఒమర్ అబ్దుల్లాకు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీస్ జారీచేసింది. ఏడు రోజుల్లోగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఈ నెల 11న తన నాయనమ్మ, ‘మదర్-ఎ-మెహర్బాన్’గా పేరుగాంచిన బేగం అక్బర్ జహాన్ 26వ వర్ధంతి సందర్భంగా జరిగిన పార్టీ సమావేశంలో ఒమర్ అబ్దుల్లా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా జమ్మూ డివిజన్కు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేను ఒక సీనియర్ బీజేపీ నేత సంప్రదించారని, పార్టీ మారితే రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు, మంత్రి పదవి, జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక సీనియర్ బీజేపీ నేత ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని కూడా ఆయన పేర్కొన్నారు. ఒమర్ వ్యాఖ్యలతో తమ పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగిందని బీజేపీ పేర్కొన్నది. జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సత్పాల్ శర్మ ఆదేశాల మేరకు అడ్వకేట్ పరిమోక్ష్ సేథ్ ద్వారా ఈ లీగల్ నోటీసును పంపింది. ఒమర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకమైనవని నోటీసులో స్పష్టంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ఏడు రోజుల్లోగా ఈ ఆరోపణలను లిఖితపూర్వకంగా ఉపసంహరించుకోవాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేయవద్దని కూడా సూచించింది. గడువులోగా ఒమర్ స్పందించకపోతే రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ సివిల్ పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ హెచ్చరించింది. దీంతోపాటు చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభిస్తామని నోటీసులో స్పష్టంచేసింది. ఈ ఆరోపణలను బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది.
రాజకీయంగా ప్రేరేపితమైన ఈ వ్యాఖ్యల వెనుక తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర ఉందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నోటీసుతో జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒమర్ అబ్దుల్లా దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.