Rakesh Tikait | దేశ ప్రజలను విడదీయడానికి బీజేపీ, ఆరెస్సెస్ ఎంతకైనా తెగిస్తాయని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ తికాయిత్ ఆరోపించారు. వాటితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తాము చేపట్టిన ఉద్యమం ఏడాది కావొస్తున్నదని శనివారం మీడియాతో అన్నారు. తమతో చర్చించేందుకు కేంద్రం ముందుకు వస్తే మంచిదని, లేదంటే నిరసన కొనసాగుతుందన్నారు. తాము చర్చలకు సిద్ధం అని, అయినా ప్రభుత్వం ఎందుకు చర్చలకు ముందుకు రావడం లేదని రాకేశ్ తికాయిత్ ప్రశ్నించారు.
చలికాలం వచ్చినందున చలిని తట్టుకునేందుకు దుస్తులు తెచ్చుకోవాలని రైతులను కోరతామని రాకేశ్ తికాయిత్ అన్నారు. హర్యానాలోని హస్సార్లో బీజేపీ ఎంపీ రామ్చందర్ జాంగ్రా కారుపై దాడి చేసిన వారు రైతులు కాదన్నారు. ఆందోళనకారుల్లో ప్రైవేట్ గూండాలు కలిసిపోయారని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోనందు వల్లే ఇలాంటి వారు రైతులతో కలిసి దాడి చేసి ఉంటారన్నారు.